ఐటీ షేర్ల జోరు: ఆరు శాతం వరకు జంప్.. కారణాలు ఇవే!

  • నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 4% జంప్
  • కోఫోర్జ్ షేరు 6 శాతం మేర పెరుగుదల
  • రూపాయి విలువ పడిపోవడం ఐటీ కంపెనీలకు లాభం
  • తక్కువ ధర వద్ద కొనుగోళ్లకు ఇన్వెస్టర్ల మొగ్గు
గత కొన్ని వారాలుగా తీవ్ర నష్టాల్లో ఉన్న భారత ఐటీ రంగ షేర్లు మంగళవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. కోఫోర్జ్, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో ఆరు శాతం వరకు లాభపడ్డాయి. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు నాలుగు శాతం మేర ముందంజ వేసింది. కోఫోర్జ్ అత్యధికంగా ఆరు శాతం పెరగ్గా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు 4 నుంచి 5 శాతం వరకు లాభపడ్డాయి.

గత కొన్ని నెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వల్ల సాంప్రదాయ సాఫ్ట్‌వేర్, కోడింగ్ ఉద్యోగాలకు ముప్పు వస్తుందనే భయాలు మార్కెట్‌ను కమ్మేశాయి. ఇటీవలే ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలు విడుదల చేసిన సరికొత్త ఏఐ ఏజెంట్ల వల్ల ఐటీ కంపెనీల ఔట్‌సోర్సింగ్ బిజినెస్ దెబ్బతింటుందనే ఆందోళనలతో ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. వాల్యుయేషన్లు 2008 నాటి సంక్షోభం స్థాయికి పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న నాణ్యమైన ఐటీ షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.

ఐటీ షేర్లు పెరగడానికి కారణాలు

రూపాయి పతనం: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా రూ.96.40 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ఐటీ కంపెనీలు తమ ఆదాయాన్ని ఎక్కువ భాగం డాలర్లలోనే ఆర్జిస్తాయి. దీంతో రూపాయి బలహీనపడటం ఐటీ రంగానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

బేర్ మార్కెట్ షార్ట్ కవరింగ్: ఈ ఏడాది ఐటీ రంగం అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో షార్ట్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్లు.. షేర్లు స్థిరపడుతున్న సంకేతాలు చూసి ఒక్కసారిగా తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేయడం వల్ల ర్యాలీకి బలం చేకూరింది.

తక్కువ వాల్యుయేషన్లు: భారీ పతనం తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి షేర్ల పీఈ రేషియోలు 15 నుంచి 19 మధ్యకు చేరాయి. ఇది గత నాలుగేళ్ల పీక్ వాల్యుయేషన్లతో పోలిస్తే సగం మాత్రమే. దీంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు.

అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం: అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తగ్గడం, అక్కడ వడ్డీ రేట్ల పెంపు అంత తీవ్రంగా ఉండకపోవచ్చనే సానుకూల అంచనాలు ఎగుమతులపై ఆధారపడే ఐటీ రంగానికి ఊరటనిచ్చాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం: అమెరికా-ఇరాన్ మధ్య చర్చల సంకేతాలు రావడంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ మెరుగైంది. ఇది ఐటీ రంగం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడానికి కారణమైంది.

IT Stocks
IT sector India
Infosys
TCS
Tech Mahindra
Rupee fall
Artificial Intelligence
Share market
Stock market
Nifty IT index

More Telugu News