యూపీఐకి పోటీ కాదు.. అంతకుమించి.. డిజిటల్ రూపాయి అసలు లక్ష్యం ఇదే!

RBI Digital Rupee Aims Beyond UPI Competition Says Experts
  • రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తున్న అధికారిక డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి(e₹)
  • యూపీఐ లాంటి పేమెంట్ సిస్టమ్ కాదు.. ఇదే నేరుగా డబ్బు
  • ఇప్పటికే రూ.34,000 కోట్లు దాటిన డిజిటల్ రూపాయి లావాదేవీలు
  • గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ చెల్లింపుల విస్తరణ దీని ముఖ్య ఉద్దేశం
  • అంతర్జాతీయ చెల్లింపులను సులభతరం చేసే సత్తా డిజిటల్ రూపాయికు ఉందని నిపుణుల అంచనా
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రవేశపెట్టిన రిటైల్ డిజిటల్ రూపాయి (e₹) దేశ ద్రవ్య వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఇది క్రిప్టోకరెన్సీ కాదు, ఆర్‌బీఐ జారీ చేసే మన కరెన్సీ నోట్లకు, నాణేలకు ఉన్న డిజిటల్ రూపం. సాధారణ డబ్బుకు ఉన్న విలువే దీనికీ ఉంటుంది. ప్రస్తుతం చాలా ప్రధాన బ్యాంకులు డిజిటల్ రూపాయి వాలెట్లను అందిస్తున్నాయి. ఇది కేవలం మరో చెల్లింపుల విధానం కాదు, డబ్బు స్వరూపాన్నే ఆధునికీకరించే ప్రణాళికలో కీలక భాగమని నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు పునాది
ఛాయిస్ వెల్త్ పరిశోధన విభాగం అధిపతి అక్షత్ గర్గ్ ప్రకారం డిజిటల్ రూపాయి అనేది ఆర్‌బీఐ అందిస్తున్న డిజిటల్ నగదు. ఇది ఆన్‌లైన్‌లో సాధారణ డబ్బులా పనిచేస్తుంది. దీనివల్ల లావాదేవీలు వేగవంతం అవ్వడమే కాకుండా, సెటిల్‌మెంట్ రిస్కులు తగ్గి ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ఆయన వివరించారు. ప్రోగ్రామబుల్ పేమెంట్స్, ఆఫ్‌లైన్ వినియోగం వంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తే, దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు మరింత విస్తరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయిలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వాడకాన్ని భారత్ పరీక్షిస్తున్న తరుణంలో, డాలర్ ఆధారిత వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, విదేశీ చెల్లింపులను సులభతరం చేసే శక్తి డిజిటల్ రూపాయికు ఉందని ఆయన పేర్కొన్నారు.

యూపీఐకి పోటీ కాదు.. అంతకుమించి
లాంగ్ టెయిల్ వెంచర్స్ వ్యవస్థాపకుడు పరమదీప్ సింగ్ మాట్లాడుతూ, డిజిటల్ రూపాయి అనేది యూపీఐకి పోటీగా వచ్చిందని భావించడం సరికాదన్నారు. ఇప్పటికే యూపీఐతో భారత్ డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రస్థానంలో ఉందని, అయితే డిజిటల్ రూపాయి లక్ష్యం అది కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మొత్తం చెల్లింపుల వ్యవస్థకు ఇది ఒక నిశ్శబ్ద పునాదిగా మారుతుందని ఆయన అంచనా వేశారు. ఆఫ్‌లైన్ చెల్లింపులు, స్మార్ట్ కాంట్రాక్టులు, వేగవంతమైన క్లియరింగ్ వంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే దీని అసలు శక్తి అని, వినియోగదారులకు స్పష్టమైన ప్రయోజనాలు కనిపిస్తేనే ప్రజలు, వ్యాపారులు దీన్ని స్వీకరిస్తారని తెలిపారు.

ప్రయోజనాలు.. సవాళ్లు
అలంకిత్ లిమిటెడ్ సీఎఫ్‌ఓ గౌరవ్ మహేశ్వరి ప్రకారం డిజిటల్ రూపాయి అనేది భారత ప్రభుత్వం మద్దతు ఉన్న వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ నగదు. 2025 మార్చి నాటికి రూ.1,016 కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీ చలామణిలో ఉందని, లక్షలాది వాలెట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆఫ్‌లైన్ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, మారుమూల ప్రాంతాలకు కూడా డిజిటల్ చెల్లింపులను విస్తరించవచ్చని, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల పంపిణీని మరింత సమర్థవంతంగా మార్చవచ్చని ఆయన అన్నారు. అయితే, సైబర్‌ సెక్యూరిటీ, వ్యక్తిగత గోప్యత, ప్రభుత్వ నిఘా వంటి ప్రమాదాల గురించి ఆయన హెచ్చరించారు.

ప్రస్తుత పరిస్థితి.. భవిష్యత్ ప్రణాళికలు
ప్రస్తుతం డిజిటల్ రూపాయి ఒక పైలట్ ప్రాజెక్టు దశను దాటి ముందుకు సాగుతోంది. ఇటీవలి నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా లావాదేవీలు రూ.34,000 కోట్లు దాటాయి. మరిన్ని బ్యాంకులను భాగస్వామ్యం చేస్తూ, ఆర్‌బీఐ దీని విస్తరణను వేగవంతం చేస్తోంది. యూపీఐ అనేది బ్యాంకు ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేస్తే, డిజిటల్ రూపాయి మాత్రం ఆర్‌బీఐ జారీ చేసిన డిజిటల్ టోకెన్ రూపంలో నేరుగా డబ్బే కావడం గమనార్హం.

ప్రస్తుతానికి యూపీఐ ఆధిపత్యం కొనసాగినప్పటికీ ఆఫ్‌లైన్ చెల్లింపులు, ప్రోగ్రామబుల్ ఫండ్స్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులోకి వస్తే, ఇతర వ్యవస్థలు పరిష్కరించలేని సమస్యలకు డిజిటల్ రూపాయి సమాధానం అవుతుంది. రానున్న కాలంలో మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ నగదును సులభతరం చేయడం, ప్రభుత్వ ప్రయోజనాల పంపిణీని మెరుగుపరచడం, అంతర్జాతీయ చెల్లింపులను చౌకగా, వేగంగా మార్చడం ద్వారా భారత ఆర్థిక మౌలిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
RBI Digital Rupee
Digital Rupee
Reserve Bank of India
e₹
UPI Payments
CBDC
Digital Currency India
Offline Payments
Digital Transactions
Indian Economy

More Telugu News