కనీసం ‘సారీ’ కూడా చెప్పాలనిపించట్లేదా?.. ఆలోచింప‌చేస్తున్న‌ నీట్ విద్యార్థిని లేఖ!

NEET Student Letter Questioning System After Exam Controversy
  • నీట్ పేపర్ లీకేజీపై ఓ విద్యార్థిని ఆవేదనభరిత లేఖ
  • కఠిన తనిఖీలు మాకేనా, లీకువీరులకు వర్తించవా? అని ప్రశ్న
  • ఎన్నో త్యాగాలు చేసి చదివితే ఫలితం శూన్యమంటూ ఆవేదన
నీట్ 2026 పరీక్ష రాసిన 18 ఏళ్ల విద్యార్థిని రాసిన ఓ బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కలను సాకారం చేసుకునేందుకు స్నేహితులను, సరదాలను, కుటుంబ సమయాన్ని సైతం త్యాగం చేసి కష్టపడి చదివితే.. చివరికి వ్యవస్థ వైఫల్యం వల్ల సర్వం నీరుగారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కేవలం తన ఒక్కరి కథ కాదని, లక్షలాది మంది విద్యార్థుల నిరాశకు, నిస్పృహకు ప్రతిరూపమని ఆమె లేఖ స్పష్టం చేస్తోంది.

"డాక్టర్ కావాలనే లక్ష్యం కోసం 12వ తరగతి నుంచి సన్నద్ధత మొదలుపెట్టాను. స్నేహితులతో మాట్లాడలేదు, పార్టీలకు వెళ్లలేదు, కనీసం నా తోబుట్టువులతో కూడా సరిగా సమయం గడపలేదు. ఇన్ని త్యాగాలు చేసింది దేనికి? నా కెరీర్ నిర్మించుకోవడానికే కదా?" అని ఆ విద్యార్థిని తన లేఖను ప్రారంభించింది. పరీక్షకు 10 రోజుల ముందు ఎన్టీఏ ఇచ్చిన "ఇది పాఠశాల పరీక్ష కాదు, జాతీయ స్థాయి ఫిల్టరేషన్ పరీక్ష" అనే హెచ్చరికను ఆమె గుర్తు చేసుకున్నారు. "అవును, ఇది పాఠశాల పరీక్ష కాదు.. ఎందుకంటే అక్కడ కనీసం పేపర్లు లీక్ కావు" అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

పరీక్ష కేంద్రం వద్ద జరిగిన కఠిన తనిఖీల గురించి వివరిస్తూ.. "మోసం జరగకుండా చూసే పేరుతో అమ్మాయిల జుట్టును విప్పి వేళ్లతో తనిఖీ చేయడం, పాకెట్స్ ఉన్నాయని టీషర్టులు, ప్యాంట్లు కత్తిరించడం వంటివి నా కళ్ల ముందే జరిగాయి. పేపర్ లీక్ చేసింది మేమే అన్నట్టుగా మమ్మల్ని చూశారు. మమ్మల్ని తనిఖీ చేయడంలో పది అడుగులు ముందున్న వ్యవస్థ, పేపర్ లీకేజీని ఆపడంలో ఎందుకు విఫలమైంది?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

పరీక్ష తర్వాత ఎట్టకేలకు కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న రెండు రోజుల్లోనే పేపర్ లీక్ అయిందని, మళ్లీ పరీక్ష జరగవచ్చనే వార్త తన ఆనందాన్ని తుడిచిపెట్టేసిందని ఆమె వాపోయారు. "ఆ రోజు నా 11 ఏళ్ల చెల్లెలు నాతో, 'ఇండియాలో మన భవిష్యత్తు గురించి ఎవరూ సీరియస్‌గా తీసుకోరు, అంతగా ఆశలు పెట్టుకోవద్దు' అని చెప్పింది. ఆ మాటకు నేనేం సమాధానం చెప్పాలి?" అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేసింది.

"ఈ దేశంలో ఉండాలని కూడా అనిపించడం లేదు. నిబంధనలు కాగితాలకే పరిమితమైనప్పుడు, మా నమ్మకం ప్రతిసారీ విచ్ఛిన్నమైనప్పుడు ఇక్కడ ఎలా ఉండగలం? కష్టపడి చదివేవారికి కాకుండా, లీకైన పేపర్లతో విజయం సాధించేవారికి విలువ ఉన్న చోట బతకడం కంటే, అలాంటి వ్యవస్థ లేని ప్రపంచాన్ని ఎంచుకోవడం మేలేమో అనిపిస్తోంది" అని ఆ విద్యార్థిని తన ఆవేదనను వెళ్లగక్కారు.

"ఇంత జరిగిన తర్వాత, పేపర్ భారీ స్థాయిలో లీక్ అయిందని, అందుకే మళ్లీ పరీక్ష పెడతామని చెప్పే ముందు, మాలాంటి విద్యార్థులకు కనీసం ఒక్క క్షమాపణ చెప్పే అర్హత కూడా లేదా?" అని వ్యవస్థను నిలదీస్తూ ఆమె తన లేఖను ముగించింది. ఈ లేఖ ఒక్క విద్యార్థిని ఆవేదన మాత్రమే కాదు, దేశంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థపై, యువత భవిష్యత్తుపై తీవ్రమైన ప్రశ్నలను సంధిస్తోంది.
Go Back to Shorts
NEET Student
NEET 2026
NEET Exam
NEET Paper Leak
Exam Paper Leak
NTA
NEET Controversy
Student Letter
Education System
Exam Malpractice

More Telugu News