అసలే ఎండలు, ఇండిగో విమానంలో ఏసీ బంద్... ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రయాణికులు!

  • వడోదర-ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
  • టేకాఫ్‌కు ముందే పనిచేయని ఏసీ, విద్యుత్ వ్యవస్థ
  • దాదాపు 30 నిమిషాల పాటు ఉక్కపోతతో ప్రయాణికుల అవస్థలు
  • సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ
  • విచారం వ్యక్తం చేసిన ఇండిగో
వడోదర నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టేకాఫ్‌కు ముందే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) వ్యవస్థ పనిచేయలేదు. దీంతో దాదాపు అరగంటకు పైగా ప్రయాణికులు తీవ్రమైన వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈ ఘటన వడోదర విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, 6ఈ 657 నంబర్ గల ఇండిగో విమానం వడోదర నుంచి న్యూఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం టార్మాక్‌పై ఉండగానే ఏసీ వ్యవస్థ ఆగిపోయింది. విమానం డోర్లు మూసి ఉండటంతో గాలి కూడా రాక, లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

గ్రౌండ్ పుష్‌బ్యాక్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడమే ఈ సమస్యకు కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. దాన్ని సరిచేసేందుకు ప్రత్యామ్నాయ పరికరాలు వెంటనే అందుబాటులో లేవని, ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. విమాన సిబ్బంది నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇండిగో సంస్థ స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పేర్కొంది. 

IndiGo
IndiGo Airlines
Vadodara
Delhi
Flight
Air Conditioning
Technical Issue
Passengers
Heat
6E 657

More Telugu News