మోదీ, చంద్రబాబు సూచనలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి

  • ఇంధన పొదుపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  • 6 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా 'సూర్య ఘర్' కనెక్షన్లు
  • ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ అందించాలని సీఎం ఆదేశం
  • పునరుత్పాదక ఇంధనంతో ఛార్జీల తగ్గింపునకు చర్యలు
  • గత ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించడమే లక్ష్యం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇంధన పొదుపు, పునరుత్పాదక ఇంధన వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా సంకల్పించారని తెలిపారు. ఇందులో భాగంగానే పగటిపూట సౌరశక్తిని వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని పేదలకు 2 కిలోవాట్ల సామర్థ్యంతో 6 లక్షల 'సూర్య ఘర్' సోలార్ కనెక్షన్లను ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా కోటి కనెక్షన్లను లక్ష్యంగా పెట్టుకుంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 20 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేయడమే ధ్యేయమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తోందని, దీనికి అదనంగా బీసీలకు రూ.20 వేలు, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీగా రూ.1.25 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి, ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గొట్టిపాటి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రూ.5,000 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించి విద్యుత్ బిల్లులు పెరగకుండా చూసిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోపిన భారాన్ని తాము అధికారంలోకి రాగానే తగ్గించామని, ఇప్పటికే యూనిట్‌కు 13 పైసలు తగ్గించామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఛార్జీలు మరింత తగ్గించడమే సీఎం లక్ష్యమన్నారు. 

తన ప్రోటోకాల్ వాహనాలను తగ్గించుకోవడం ద్వారా ఇంధన పొదుపును స్వయంగా ఆచరిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలతో క్లీన్ ఎనర్జీ అందించే దిశగా పనిచేస్తూ, ప్రపంచంలోని ఉత్తమ విద్యుత్ సంస్కరణలను అందిపుచ్చుకునే తొలి రాష్ట్రంగా ఏపీని నిలబెడతామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.


Gottipati Ravikumar
Andhra Pradesh
energy conservation
renewable energy
solar power
Chandrababu Naidu
Narendra Modi
Suryaghar scheme
electricity charges

More Telugu News