'మీరు ఇలాగే చేస్తే భద్రతా సిబ్బంది గన్ తీయాల్సి వస్తుంది'.. ఢిల్లీలో జర్నలిస్టుకు రష్యా మంత్రి వార్నింగ్

  • ఢిల్లీలో మీడియా సమావేశంలో రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఆగ్రహం
  • ఫోన్‌తో అంతరాయం కలిగించిన జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు
  • భద్రతా సిబ్బంది గన్ తీస్తారని హెచ్చరించిన లావ్‌రోవ్
  • బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి
  • ప్రధాని మోదీతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ భారత పర్యటనలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పదేపదే అంతరాయం కలిగించిన ఓ జర్నలిస్టుపై ఆయన తీవ్రంగా స్పందించారు. "మీరు ఇలాగే చేస్తే భద్రతా సిబ్బంది గన్ తీయాల్సి వస్తుంది" అని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన లావ్‌రోవ్, మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తుండగా ఈ ఘటన జరిగింది. సమావేశం జరుగుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్‌లో మాట్లాడుతుండటంతో పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో లావ్‌రోవ్ మొదట మర్యాదపూర్వకంగా, "దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీరు గానీ, మీ ఫోన్ గానీ బ‌య‌ట‌కు వెళ్లాలి" అని సూచించారు. అయినప్పటికీ సదరు జర్నలిస్టు మళ్లీ ఫోన్‌లో మాట్లాడటంతో ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "నేను జోక్ చేయడం లేదు. మీరు మీ ఫోన్ కింద పెట్టకపోతే, వాళ్లు గన్ తీస్తారు" అని గట్టిగా హెచ్చరించారు.

ఈ ఘటన పక్కన పెడితే, లావ్‌రోవ్ తన పర్యటనలో భాగంగా పలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

2025 డిసెంబర్‌లో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన 23వ వార్షిక సదస్సు తర్వాత భారత్-రష్యా సహకారంలో సాధించిన పురోగతిని లావ్‌రోవ్ ప్రధానికి వివరించినట్లు పీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-రష్యా మధ్య ఉన్న "ప్రత్యేక మరియు విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం"లో పురోగతిపై లావ్‌రోవ్ అందించిన వివరాలను తాను అభినందిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

Sergey Lavrov
Russia
Indian visit
Delhi
Journalist
BRICS summit
Narendra Modi
Vladimir Putin
India Russia relations
Ukraine conflict

More Telugu News