విచారణకు హాజరుకాలేకపోతున్నాను: పోలీసులకు బండి భగీరథ్ లేఖ

  • వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడి
  • విచారణకు అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండు రోజులు కావాలని విజ్ఞప్తి
  • దర్యాప్తుకు సహకరిస్తానన్న బండి భగీరథ్
  • విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని కేటాయించాలని విజ్ఞప్తి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి బుధవారం పోలీసుల విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని, విచారణకు అందుబాటులోకి వచ్చేందుకు రెండు రోజుల గడువు కావాలని పోలీసులకు లేఖ రాశాడు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులకు మెయిల్ పంపించాడు.

మే 8వ తేదీన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణకు హాజరుకావాలని పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. అయితే, తక్కువ సమయంలో నోటీసులు అందాయని, తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలకు వ్యతిరేకంగా ఆధారాలు, సమాచారం సేకరించేందుకు సమయం కావాలని భగీరథ్ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని సూచించాలని కోరారు.

మరోవైపు, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కఠినమైన పోక్సో సెక్షన్ 5(1), 6ను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతమైంది.

ఇదిలా ఉండగా, భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. తప్పుడు కేసు పెట్టి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని బాధితురాలి కుటుంబంపై భగీరథ్ కరీంనగర్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Bandi Bhagirath
Bandi Sanjay
POCSO case
Telangana High Court
Revanth Reddy
R S Praveen Kumar

More Telugu News