భారత్ లో డచ్ మహిళ బైక్ టైర్ పంచర్... సాయం చేసేందుకు మనవాళ్లు పోటీపడ్డారు!
- ఇండియాలో పర్యటిస్తున్న మైకే హిజ్మాన్
- మార్గమధ్యంలో పంక్చర్ అయిన బైక్ టైర్
- ఆమెకు సహాయం చేసిన ముగ్గురు స్థానికులు
- ఇన్స్టా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్న హిజ్మాన్
సోలో మోటార్ సైకిల్ యాత్రలో భాగంగా భారతదేశాన్ని చుట్టేస్తున్న డచ్ ట్రావెలర్ మైకే హిజ్మాన్ కు ఒక హైవేపై చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న బైక్ టైర్ మధ్యలోనే పంక్చర్ కావడంతో, ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడిపోయింది. ఆ ప్రాంతం తనకు కొత్త కావడం, బైక్ రిపేర్ చేయడం తెలియకపోవడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే, ఆమె పరిస్థితిని గమనించిన ముగ్గురు స్థానిక వ్యక్తులు వెంటనే తమ వాహనాన్ని ఆపి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆ ముగ్గురు వ్యక్తులు టైర్ను పరిశీలించి, తాత్కాలికంగా దాన్ని సరిచేయడమే కాకుండా, సమీపంలోని మెకానిక్ షాపుకు ఆమెను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ మొత్తం ఉదంతాన్ని మైకే తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంటూ, ఆ అపరిచితులు తనను ఆదుకున్న తీరును చూసి ఎంతగానో ఊరట చెందానని పేర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, "పర్యాటకులు గుర్తుంచుకునే అసలైన భారతదేశం ఇదే" అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.