మహాకాళేశ్వరుడి సన్నిధిలో తమన్నా.. భస్మ హారతిలో పాల్గొన్న నటి

Tamannaah Bhatia Attends Bhasma Aarti at Mahakaleshwar Temple
  • ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తమన్నా
  • దైవ పిలుపు ఉన్నప్పుడే ఈ ఆలయాన్ని దర్శించుకోగలమన్న మిల్కీ బ్యూటీ
  • భస్మ హారతిని వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని వ్యాఖ్య

ప్రముఖ నటి తమన్నా ఈ తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మ ముహూర్తంలో జరిగే అత్యంత పవిత్రమైన 'భస్మ హారతి' సేవలో ఆమె పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, తన స్నేహితురాలు, నిర్మాత ప్రజ్ఞా కపూర్‌తో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, గంటల నాదాల మధ్య జరిగిన ఈ క్రతువులో తమన్నా అత్యంత భక్తిశ్రద్ధలతో లీనమై ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


దర్శనం అనంతరం తమన్నా మీడియాతో మాట్లాడుతూ, "దైవ పిలుపు ఉన్నప్పుడే ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలరు. ఈ రోజు భస్మ హారతిని వీక్షించే అవకాశం కలగడం నా అదృష్టం. అక్కడ కూర్చుని ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలను అనుభూతి చెందడం ఒక గొప్ప శక్తిని ఇచ్చింది" అని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, తన రాబోయే ప్రాజెక్టులు విజయవంతం కావాలని మొక్కుకున్నారు.


సినిమాల విషయానికి వస్తే, తమన్నా త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'వ్యాన్' అనే ఫోక్‌లోర్ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఏక్తా కపూర్, టీవీఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 28న రక్షా బంధన్ కానుకగా విడుదల కానుంది. మధ్య భారతదేశంలోని దట్టమైన అడవుల నేపథ్యంలో, పురాతన ఇతిహాసాలు, దేవాలయాల చుట్టూ ఈ కథ సాగనుంది. దీపక్ మిశ్రా, అరుణభ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Go Back to Shorts
Tamannaah Bhatia
Tamanna Bhatia
Mahakaleshwar Temple
Ujjain
Bhasma Aarti
Pragya Kapoor
Van Movie
Sidharth Malhotra
Ekta Kapoor
Bollywood

More Telugu News