సరిహద్దులో భారత్ ఫెన్సింగ్... ఘాటుగా స్పందించిన బంగ్లాదేశ్

  • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం
  • బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయించిన బెంగాల్ లోని సువేందు ప్రభుత్వం
  • కేంద్ర ప్రభుత్వంతోనే తమకు సంబంధాలు ఉంటాయన్న బంగ్లా విదేశాంగ శాఖ సలహాదారు

పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సరిహద్దు రక్షణపై తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం కోసం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా స్పందించింది.


భారత్ సరిహద్దుల్లో ముళ్లకంచె వేయడంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఎం.హెచ్. కబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ముళ్ల తీగలకు ఢాకా భయపడదు" అని పేర్కొంటూనే, తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భారత్ అంతర్గత రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోమని, తమకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతోనే సంబంధాలు ఉంటాయని ఆయన వివరించారు. సవాళ్లు ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు నాయకత్వం కట్టుబడి ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం, అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే సరిహద్దు కంచె నిర్మాణ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి తొలి మంత్రివర్గ సమావేశంలోనే బీఎస్‌ఎఫ్‌కు అవసరమైన భూమిని కేటాయించడం ద్వారా ఈ దిశగా బలమైన ముందడుగు వేశారు. అక్రమ చొరబాట్లను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ చర్య ఇప్పుడు పొరుగు దేశంతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.


Bangladesh
India Bangladesh border fence
India Bangladesh relations
MH Kabir
Suvendu Adhikari
West Bengal
Border Security Force
BSF
illegal immigration
Dhaka

More Telugu News