సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు

PM Modi Attends Somnath Amrit Mahotsav 75th Anniversary
  • సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో ప్రధాని మోదీ
  • ఆలయంలో జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ నిర్వహణ
  • 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో కుంభాభిషేకం
  • వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ల నుంచి ఆలయంపై పూల వర్షం
  • ఈ పర్యటన సందర్భంగా భారీ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 'సోమనాథ్ అమృత్ మహోత్సవ్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

ఈ ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ సోమనాథ్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్ షోలో వేలాది మంది ప్రజలు పాల్గొని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో ప్రజలు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఈ రోడ్ షోలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కూడా ఉన్నారు.

అనంతరం ప్రధాని మోదీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో కుంభాభిషేకం చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ జరిపించారు. ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు.

1951లో పునర్నిర్మించిన ఈ ఆలయాన్ని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా   ప్రారంభించారు. ఆ చారిత్రక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అమృత్ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యక్రమాల అనంతరం సోమనాథ్‌లోని సద్భావన మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Go Back to Shorts
PM Modi
Narendra Modi
Somnath Temple
Gujarat
Somnath Amrit Mahotsav
Hindu Temple
Gir Somnath
Bhupendra Patel
pilgrimage
Rajendra Prasad

More Telugu News