సీఎం అయ్యాక విజయ్ తొలి ప్రసంగం... వచ్చీ రావడంతోనే గత ప్రభుత్వంపై విమర్శల దాడి

Vijay First Speech as CM Criticizes Past Government
  • తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణం చేసిన నటుడు విజయ్
  • గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానాను ఖాళీ చేసిందని తీవ్ర ఆరోపణ
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని సంచలన ప్రకటన
  • తప్పు చేస్తే తన సొంత ప్రభుత్వంలోని వారినైనా వదిలిపెట్టనని తీవ్ర హెచ్చరిక
  • మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, శాంతిభద్రతలకే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టీకరణ
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగంలోనే ఆయన గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రం సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉందని, ఖజానాను పూర్తిగా తుడిచిపెట్టేశారని సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందని, అవినీతిని ఏమాత్రం సహించబోనని, తప్పు చేస్తే తన వారిని కూడా ఉపేక్షించనని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

నేనూ మీలో ఒకడినే..
ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. "సినిమాల్లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని కష్టపడిన ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకుగా, నాకు పేదరికం, ఆకలి విలువ బాగా తెలుసు. నేనేమీ రాజుల కుటుంబం నుంచి రాలేదు. మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా నన్ను నేను భావిస్తున్నాను. మీరు కూడా నన్ను అలాగే ఆదరించినందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను" అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తనను ఎన్నో అవమానాలు, కష్టాలు చుట్టుముట్టినా ప్రజలు అండగా నిలిచారని, వారి రుణం తీర్చుకోవడానికే వచ్చానని స్పష్టం చేశారు.

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం..
గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, "గత ప్రభుత్వం రాష్ట్రంపై మోయలేని అప్పుల భారాన్ని మోపి, ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం బాధ్యతలు స్వీకరించాం. ఇది నిందలు వేయడం కాదు, వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుంచాలి. అందుకే, రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలియజేసేందుకు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాను. మాది పారదర్శకమైన ప్రభుత్వం. ఏదీ దాపరికాలు లేకుండా, ముసుగులు వేసుకోకుండా బహిరంగంగానే వ్యవహరిస్తాను" అని విజయ్ ప్రకటించారు.

అవినీతిని సహించను.. ఒకే పవర్ సెంటర్
అవినీతిపై తన వైఖరిని స్పష్టం చేస్తూ, "ప్రజాధనం నుంచి ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను. ఆ అవసరం నాకు లేదు, అది మీకు బాగా తెలుసు. ఈ విజయ్ తప్పు చేయడు, ఇతరులను చేయనివ్వడు. నా ప్రభుత్వంలో ఉన్నవారైనా సరే, తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు. గెలిచాం కదా అని ఆటలు ఆడదామనే ఆలోచన ఎవరికైనా ఉంటే, ఇప్పుడే దాన్ని తుడిచిపెట్టేయండి. ఇక్కడ ఒకే ఒక్క పవర్ సెంటర్ ఉంటుంది, అది నా నాయకత్వంలోనే ఉంటుంది. వేర్వేరు అధికార కేంద్రాలకు తావు లేదు" అని గట్టిగా హెచ్చరించారు.

ప్రాధాన్యతలు, హామీలు
తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ, "మహిళల భద్రతకు కఠిన చర్యలు తీసుకుంటాం. యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్ సంస్కృతిని అణిచివేసేందుకు ఇప్పటి నుంచే చర్యలు మొదలుపెడతాను. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, విద్య, రేషన్, వైద్యం, తాగునీరు, రోడ్లు, బస్సు సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలపైనే నా పూర్తి దృష్టి ఉంటుంది," అని హామీ ఇచ్చారు. "నన్ను అవమానించిన వారు కూడా నా ప్రజలే. స్నేహితులైనా, శత్రువులైనా రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది ప్రజలు నా వాళ్లే" అని పేర్కొన్నారు.

అందరినీ కలుపుకుపోతాం
మత సామరస్యంపై మాట్లాడుతూ, "పుట్టుకతో జీవులందరూ సమానమే అనేదే మా సిద్ధాంతం. మైనారిటీ సోదరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవులందరి ముఖం ఈ విజయ్ ముఖం. ఈ విషయంలో నన్ను 100 శాతం నమ్మవచ్చు" అని భరోసా ఇచ్చారు. తన గెలుపునకు కారణమైన చిన్నారులకు, పార్టీ కార్యకర్తలకు, వర్చువల్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

తన ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీపీఎం నేతలు ఎంఏ బేబీ, కే. బాలకృష్ణన్, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నేత డి. రాజా సహా ఇతర మిత్రపక్షాల నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. "ఇది ఒక కొత్త ఆరంభం. నిజమైన లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన పాలన ఇక్కడి నుంచే మొదలవుతుంది" అని విజయ్ తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Vijay
Tamil Nadu politics
Tamilaga Vetri Kazhagam
TVK party
Tamil Nadu debt
Corruption allegations
Tamil Nadu government
MK Stalin
Rahul Gandhi
Mallikarjun Kharge

More Telugu News