విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు

  • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల
  • ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
  • ప్రధాని మోదీ, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి
  • 2026 జూన్ 1 నుంచి అధికారికంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభం
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆశాభావం
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖపట్నం రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రాత్మక క్షణమని ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం శుభపరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మార్పులతో ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పారిశ్రామిక ప్రగతికి ఈ జోన్ ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.

Chandrababu Naidu
Visakha Railway Zone
South Coast Railway Zone
Andhra Pradesh
Narendra Modi
Ashwini Vaishnaw
Waltair Division
Visakhapatnam
Railway Gazette
Palasa Ichchapuram

More Telugu News