వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు!
- సామాన్యులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
- ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించిన హిందుస్థాన్ యూనీలీవర్
- ఇతర కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం
నిత్యం మనం వాడే సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల ధరలు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనీలీవర్, తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు నేరుగా సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టబోతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ పెంపునకు మూలకారణంగా కనిపిస్తున్నాయి. యుద్ధ మేఘాల వల్ల ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్, సబ్బులు తదితర అన్ని వస్తువుల తయారీకి అవసరమైన ముడిసరుకుల వ్యయం 8 నుంచి 10 శాతం పెరిగింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని తట్టుకుని, కంపెనీ లాభాలను కాపాడుకోవడానికి ధరల సర్దుబాటు తప్పనిసరి అయిందని సీఈఓ ప్రియా నాయర్, సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా స్పష్టం చేశారు.
మనం రోజూ వాడే అనేక బ్రాండ్ల ధరలు ఇప్పటికే 2 నుంచి 5 శాతం పెరిగాయి. మరికొన్ని ఉత్పత్తుల విషయంలో ధర పెంచకుండా, ప్యాకెట్ పరిమాణాన్ని తగ్గించే వ్యూహాన్ని కూడా కంపెనీ అమలు చేస్తోంది. సాధారణంగా హిందుస్థాన్ యూనీలీవర్ వంటి పెద్ద సంస్థ ధరలు పెంచితే, దానిని అనుసరిస్తూ మిగిలిన పోటీ సంస్థలు కూడా రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ఎఫ్ఎంసీజీ రంగంలో ధరల పెరుగుదలకు దారితీసి, ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతుంది.