రౌడీ షీటర్ మిస్సింగ్ కేసులో చంద్రబాబు సీరియస్.. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్
- సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్ కు తరలింపు
- అప్పటి నుంచి కనిపించకుండా పోయిన సాయికృష్ణ
విజయవాడ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజుపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ సాయికృష్ణను ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆ తర్వాత సాయికృష్ణ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఈ వివాదం మొదలైంది.
తన కొడుకు ఎక్కడ ఉన్నాడంటూ సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి అడగ్గా... సీఐ నాగరాజు అత్యంత దారుణంగా సమాధానం ఇచ్చారని ఆమె ఆరోపించారు. "నీ కొడుకు చచ్చాడు.. ఇకపై పోలీస్ స్టేషన్కు రావొద్దు" అని సీఐ నాగరాజు తరిమేశారంటూ తల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై వైసీపీ శ్రేణులు అధికార కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఈ ఉదంతం తీవ్ర రూపం దాల్చడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ వివాదంలో సీఐ నాగరాజును వీఆర్ కు పంపారు. తాజాగా, ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. దాంతో పాటు, ఈ మిస్సింగ్ కేసుపై ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, పూర్తి నివేదికను సబ్మిట్ చేయాలని డీజీపీకి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.