అమరావతికి నిధుల కేటాయింపుపై సజ్జల ఆగ్రహం
- అమరావతి పనుల కోసం రూ. 2,400 కోట్ల నిధుల మంజూరు
- భవనాల అలంకరణకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని మండిపాటు
- సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నిధులు మళ్లిస్తున్నారని ఆరోపణ
అమరావతి అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర కేబినెట్ దాదాపు రూ. 2,400 కోట్ల నిధులు మంజూరు చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. కేబినెట్ నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయని, ఇవి కేవలం చంద్రబాబు గారి 'సంపద సృష్టి' కోసమే తప్ప ప్రజల కోసం కాదని ఆయన ఆరోపించారు. సచివాలయ భవనాల గ్లాస్ క్లాడింగ్ వంటి పనుల కోసం రూ. 2,400 కోట్లకు పైగా కేటాయించడమేంటని సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కేవలం భవనాల అలంకరణకే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.
ఒకవైపు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు నిధులు లేవని చెబుతూ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్న ప్రభుత్వం, మరోవైపు రాజధాని భవనాల కోసం వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అమరావతిని 'భ్రమరావతి'గా అభివర్ణిస్తూ, చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం కృష్ణా నదిలా నిధులను అక్కడికి మళ్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. భూములు దోచుకునే బరితెగింపు పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.