టీ స్టాల్లో రూ.40 కోసం ఐపీఎస్గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు
- లక్నోలో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్
- టీ స్టాల్లో రూ.40 టీ బిల్లు చెల్లించకుండా గొడవ
- తనకు సెల్యూట్ చేయాలని పోలీసులనే డిమాండ్ చేసిన నిందితుడు
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పూర్తి వివరాల్లోకి వెళితే, నోయిడాకు చెందిన మిథిలేష్ శుక్లా అనే ప్రైవేట్ ఉద్యోగి జూన్ 13 రాత్రి లక్నోలోని మహానగర్ ప్రాంతంలో ఉన్న ఒక టీ స్టాల్ వద్ద బన్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోతుండటంతో, దుకాణ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో తాను నోయిడాలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారిని అంటూ మిథిలేష్ బుకాయించాడు.
కనీస మర్యాద లేకుండా తనను ప్రశ్నిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, తనకు సెల్యూట్ చేయాలని పట్టుబట్టాడు. అయితే, యూనిఫాం ధరించకుండా, గుర్తింపు కార్డు చూపకుండా సెల్యూట్ చేసే ప్రసక్తే లేదని అక్కడి కానిస్టేబుల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, అతనికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అడిగిన వివరాలకు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారిగా చలామణి అవ్వడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నకిలీ అధికారిని ధైర్యంగా ఎదుర్కొన్న పోలీసుల తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.