పాక్‌కు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. భారత్‌ను ఆకాశానికెత్తిన పాక్ మంత్రి

  • భారత్‌లా తమకు వ్యూహాత్మక చమురు నిల్వలు లేవని అంగీక‌రించిన పాక్ మంత్రి 
  • ఐఎంఎఫ్ షరతులే తమ కష్టాలకు కారణమని పాక్ పెట్రోలియం శాఖ మంత్రి వ్యాఖ్య
  • భారత్ తన విదేశీ మారక నిల్వలు, పన్ను తగ్గింపులతో ధరలను స్థిరంగా ఉంచింద‌ని ప్రశంస‌
  • భారత్ వద్ద 60-70 రోజులకు సరిపడా నిల్వలున్నాయన్న‌ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 126 డాలర్లకు చేరడంతో భారత్, పాకిస్థాన్ దేశాల ఆర్థిక సామర్థ్యాల మధ్య ఉన్న వ్యత్యాసం మరోసారి స్పష్టంగా బయటపడింది. హ‌ర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సంక్షోభాన్ని భారత్ తన భారీ విదేశీ మారక నిల్వలు, వ్యూహాత్మక చమురు నిల్వలతో సమర్థంగా ఎదుర్కొంటుండగా, పాకిస్థాన్ మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిపై పాకిస్థాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్వయంగా స్పందిస్తూ, భారత్‌తో తమ దేశాన్ని పోల్చుతూ వాస్తవ పరిస్థితిని అంగీకరించారు.

ఒక స్థానిక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) విధించిన కఠినమైన షరతులే తమ దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు కారణమని మాలిక్ పేర్కొన్నారు. భారత్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన ప్రశంసించారు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాదు, వారి వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా ఉన్నాయి. అందుకే వారు ఈ సంక్షోభాన్ని తట్టుకోగలుగుతున్నారు. అంతేగాక వారు ఐఎంఎఫ్ కార్యక్రమంలో లేరు. చమురు ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించుకుని తమ ప్రజలను ఆదుకునే ఆర్థిక వెసులుబాటు వారికి ఉంది" అని మాలిక్ వివరించారు.

తమ దేశంలో పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. "డీజిల్, పెట్రోల్‌పై సుంకం విధిస్తామని బడ్జెట్ సమయంలో ఐఎంఎఫ్‌కు హామీ ఇచ్చాం. కానీ, ఇప్పుడు డీజిల్ ధరలు 3-4 రెట్లు పెరగడంతో దానిపై సుంకాన్ని సున్నాకి తగ్గించి, ఆ భారాన్ని పెట్రోల్‌పైకి మార్చాము. మోటార్ సైకిల్ వాడేవారికి ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నాం. ఐఎంఎఫ్‌తో రహస్య చర్చలు జరిపి, పెట్రోల్ పై లీటర్‌కు రూ. 80 సుంకాన్ని తగ్గించడానికి ఒప్పించాం" అని ఆయన అన్నారు.

పాకిస్థాన్ వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు లేవని, కేవలం వాణిజ్య నిల్వలు మాత్రమే ఉన్నాయని మాలిక్ అంగీకరించారు. "మా వద్ద 5-7 రోజులకు సరిపడా ముడి చమురు, 20-21 రోజులకు సరిపడా శుద్ధి చేసిన ఇంధనం మాత్రమే ఉంది. భారత్‌లా 60-70 రోజుల నిల్వలు లేవు" అని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 80 తగ్గించి రూ. 378కి చేర్చింది. మరోవైపు భారత్, కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను చాలావరకు స్థిరంగా ఉంచుతూ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. ఈ సంక్షోభం ఇరు దేశాల ఆర్థిక ప్రణాళికల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా ఎత్తిచూపింది.

Ali Pervaiz Malik
Pakistan
Praises
India
Fuel Crisis

More Telugu News