దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన

Chandrababu praises Narayana GSL hospitals for performing first Tele Robotic surgery in India
  • టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు
  • వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు
  • ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందన్న చంద్రబాబు
టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ-ఆసుపత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆసుపత్రుల యజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ రెండు ఆసుపత్రులు కలిసి టెలి-రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలి-రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కరరావు సీఎంకు వివరించారు. 

నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌లో ఉన్న రోగికి రాజమండ్రి జీఎస్‌ఎల్ ఆసుపత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశానని... అలాగే జీఎస్‌ఎల్‌లో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. 

ఈ సందర్భంగా రెండు ఆసుపత్రుల యజమాన్యాలను చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని ఈ సంస్థలు నిరూపించాయని సీఎం అన్నారు. రెండు రోజుల వ్యవధిలో నాలుగు సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని సీఎం పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
TDP
Tele Robotic Surgery

More Telugu News