ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూత... క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల

  • రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల
  • సరఫరా లోపాల వల్లే కొన్ని బంకులు మూతపడ్డాయని వెల్లడి
  • కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • పెట్రోల్ బంకుల మూసివేతపై నివేదిక కోరిన సీఎం చంద్రబాబు
  • ఆయిల్ డిపోలను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొన్ని పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టడం, ప్రజలు క్యూలలో నిలబడటం వంటి పరిణామాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

కేవలం సరఫరా లోపాల కారణంగానే కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇంధన నిల్వలకు లోటు లేదని ఆయన తెలిపారు. కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టిస్తూ బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా వ్యవస్థకు ఆటంకాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ డిపోలతో పాటు ప్రైవేట్ కంపెనీల అవుట్‌లెట్లను కూడా జిల్లా అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద శాంతిభద్రతల సమస్యలు రాకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని కోరారు.

ఈ అంశంపై ఎంపీ పురందేశ్వరి కూడా స్పందిస్తూ, కొన్ని ఏజెన్సీలు కృత్రిమ కొరత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని విమర్శించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆమె సూచించారు.

కాగా, రాష్ట్రంలో పెట్రోల్ బంకుల మూసివేతలపై సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రకటనలతో క్షేత్రస్థాయిలో పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని భావిస్తున్నారు.

Nadendla Manohar
Petrol
Diesel
Shortage
Janasena
TDP
BJP
NDA
Andhra Pradesh

More Telugu News