కవిత 'టీఆర్ఎస్' పార్టీపై కాంగ్రెస్ విమర్శలు
- బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి
- బీఆర్ఎస్ లో అంతర్భాగమే టీఆర్ఎస్ అని వ్యాఖ్య
- అంతా 'గ్యాస్' అంటూ కాంగ్రెస్ నేత సెటైర్
కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)ను ప్రకటించిన కొద్దిసేపటికే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా ఆమె తన తండ్రి కేసీఆర్ ను 'మరమనిషి' అని సంబోధించడం, రేవంత్ రెడ్డిని పాలనను 'హిట్లర్ పాలన'తో పోల్చడం సంచలనంగా మారింది. కవిత టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.
కవిత పెట్టిన 'తెలంగాణ రాష్ట్ర సేన' స్వతంత్రమైనది కాదని, అది బీఆర్ఎస్ పార్టీకి ఒక 'తోక పార్టీ' మాత్రమేనని రామ్మోహన్ రెడ్డి అన్నారు. తండ్రి కేసీఆర్, తనయ కవిత ఇద్దరూ ఒక్కటేనని.. బాపు నడిపే బీఆర్ఎస్ లో అంతర్భాగమే ఈ కొత్త టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. "తలా తోక ఎప్పటికీ ఒక్కటే... బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తనయ టీఆర్ఎస్.. అంతా గ్యాస్ " అని సెటైర్ వేశారు.