కృష్ణా తీరాన సింగపూర్ మెరుపులు... మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రులు

  • సింగపూర్ పర్యటనలో మెరీనా బ్యారేజీని సందర్శించిన ఏపీ మంత్రుల బృందం
  • వరద నియంత్రణ, నీటి సంరక్షణ విధానాలపై అధ్యయనం
  • బ్యారేజ్ ప్రాముఖ్యతను వివరించిన ఖూ టెంగ్ చై
  • కృష్ణా తీరంలో ఇటువంటి మోడల్ అమలుపై మంత్రుల చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక హంగులతో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రుల బృందం, అక్కడి ప్రసిద్ధ మెరీనా బ్యారేజీని సందర్శించి అధ్యయనం చేసింది. వరద నియంత్రణ, నీటి సరఫరా, పర్యాటకాన్ని ఒకేచోట మేళవించిన ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మాణ శైలిని, నిర్వహణ విధానాలను మంత్రులు క్షుణ్ణంగా పరిశీలించారు.

తమ సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు మెరీనా బ్యారేజీని సందర్శించారు. పర్యావరణానికి హాని కలగకుండా నీటి సమస్యలను అధిగమించడం, గ్రీన్ రూఫ్ వంటి కట్టడాలతో దీనిని ఒక పర్యాటక కేంద్రంగా ఎలా తీర్చిదిద్దారనే విషయాలను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ డైరెక్టర్ ఖూ టెంగ్ చై మంత్రుల బృందానికి వివరించారు.

ఈ పర్యటన అనంతరం హోంమంత్రి అనిత స్పందిస్తూ, మెరీనా బ్యారేజ్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో, కృష్ణా నది తీరాన కూడా ఇటువంటి ఆధునిక అభివృద్ధి నమూనాలను అమలు చేసే అవకాశాలపై తమ బృందం చర్చించినట్లు వెల్లడించారు. 

AP Ministers in Singapore
Marina Barrage
Anitha
Atchannaidu
Anagani Sathya Prasad
Sathya Kumar Yadav
BC Janardhan Reddy

More Telugu News