రైతు భరోసా లేక బోనస్.. ఏదో ఒకటి ఎంచుకోవాలి: చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- రైతుల కోసం అమలు చేస్తున్న బహుళ పథకాల వల్ల నిధుల నిర్వహణ కష్టంగా మారిందన్న గుత్తా
- దీని వల్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్య
- కేవలం బోనస్ కోసమే రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్న గుత్తా
తెలంగాణ రైతు సంక్షేమ పథకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బహుళ పథకాల వల్ల నిధుల నిర్వహణ కష్టతరమవుతోందని, దీనివల్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతు భరోసాతో పాటు పంటలకు బోనస్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై మోయలేని భారం పడుతోందని పేర్కొన్నారు. కేవలం బోనస్ కోసమే సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని గుర్తు చేశారు.
ఒకవైపు రైతు భరోసా నిధులు అందలేదని రైతులు అసంతృప్తితో ఉన్నారని, మరోవైపు పథకాల అమలులో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. రైతు భరోసా లేదా పంటల బోనస్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకుని దానిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఏదో ఒకదానిపై ప్రభుత్వం త్వరగా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరారు.