ఆపిల్‌లో కొత్త శకం.. 15 ఏళ్ల తర్వాత తప్పుకున్న సీఈవో టిమ్ కుక్

  • ఆపిల్ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ నియామకం
  • ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్న టిమ్ కుక్
  • ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ హెడ్‌గా ఉన్న టెర్నస్
  • సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు
టెక్ దిగ్గజం ఆపిల్‌లో ఒక శకం ముగిసింది. 15 ఏళ్లుగా కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్న టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సంస్థ ప్రకటించింది. ఆయన స్థానంలో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) జాన్ టెర్నస్‌ను నియమించింది. ఈ మార్పులు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సీఈవో పదవి నుంచి వైదొలగినప్పటికీ, టిమ్ కుక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సేవలు అందించనున్నారు.

50 ఏళ్ల జాన్ టెర్నస్ గత 25 ఏళ్లుగా ఆపిల్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. 2001లో కంపెనీలో చేరిన ఆయన, ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. మ్యాక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్ వంటి విజయవంతమైన ఉత్పత్తుల రూపకల్పనలో టెర్నస్ తెరవెనుక కీలక పాత్ర పోషించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఎన్విడియా, మెటా వంటి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న తరుణంలో ఈ నాయకత్వ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఐఫోన్లలో ఏఐని మరింత సమర్థంగా చేయడంతో పాటు, ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి కొత్త తరం ఉత్పత్తులపై టెర్నస్ దృష్టి సారిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే, ఆపిల్ తన సిరి కోసం గూగుల్ జెమినీ ఏఐ మోడల్‌ను వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

2011లో స్టీవ్ జాబ్స్ అనారోగ్యంతో తప్పుకున్న తర్వాత టిమ్ కుక్ ఆపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో కంపెనీ మార్కెట్ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. తాజా మార్పుల్లో భాగంగా, జానీ స్రౌజీని చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్‌గా నియమించారు.

John Ternus
Apple
iPhone
Tim Cook
Business
Steve Jobs

More Telugu News