ఉక్రెయిన్ రాజధానిలో ఆగంతకుడి నరమేధం

  • ఆగంతకుడి దాడిలో కీవ్‌లో ఆరుగురు పౌరుల మృతి
  • రష్యాలో పుట్టిన నిందితుడిని హతమార్చిన పోలీసులు
  • ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించిన ఉక్రెయిన్
యుద్ధ వాతావరణం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మరోసారి రక్తపాతం జరిగింది. శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

నగరంలోని హోలోసీవ్స్కీ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 58 ఏళ్ల నిందితుడు తొలుత తన అపార్ట్‌మెంట్‌కు నిప్పంటించాడు. ఆ తర్వాత ఆటోమేటిక్ తుపాకీతో వీధుల్లోకి వచ్చి కనిపించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు సమీపంలోని ఓ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి, అక్కడున్న వారిని బందీలుగా చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అయితే, చర్చలు విఫలం కావడంతో పాటు లోపల బందీగా ఉన్న ఒకరిని అతను కాల్చి చంపడంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు (KORD) లోపలికి ప్రవేశించి నిందితుడిని హతమార్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది.

ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. నిందితుడు రష్యాలోని మాస్కోలో జన్మించాడని, గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. ఆశ్చర్యకరంగా, అతని వద్ద తుపాకీకి లైసెన్స్ కూడా ఉందని వెల్లడించారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి కూడా ఉందని మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపారు. ఉక్రెయిన్ భద్రతా సంస్థ ఈ దాడిని ఉగ్రవాద చర్యగా నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం కీవ్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Kyiv Shooter
Kyiv
Ukraine
Zelensky
Russia
KORD
Vitally Klitschko
Terrorism

More Telugu News