నిన్న మహిళలకు జరిగిన ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళతాం: సీఎం చంద్రబాబు

Chandrababu attends protest in Nidadavolu against opposition parties
  • మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై నిడదవోలులో ఎన్డీఏ నిరసన
  • బిల్లును అడ్డుకుని విపక్షాలు జాతికి ద్రోహం చేశాయని మండిపడ్డ చంద్రబాబు
  • పార్లమెంట్‌లో జరిగిన పరిణామం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బ్లాక్ డే అని వ్యాఖ్య
  • విపక్షాల ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని, ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరిక
  • కుట్ర చేసిన పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలకు పిలుపు
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు జాతికి ద్రోహం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఒక బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు. మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు శనివారం భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడి, విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే సుదీర్ఘ కల సాకారం అవుతుందని దేశమంతా ఆశగా ఎదురుచూసింది. కానీ, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు తమ సంకుచిత రాజకీయ అజెండా కోసం ఈ చారిత్రక బిల్లును అడ్డుకుని దుర్మార్గానికి పాల్పడ్డాయి. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని నమ్మే సంస్కృతి మనది. కానీ, పార్లమెంటులో అందుకు భిన్నంగా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం క్షమించరాని నేరం" అని చంద్రబాబు మండిపడ్డారు.

ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధానమంత్రి, హోంమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. "సీట్లు 50 శాతం మేర పెరుగుతాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో సీట్లు పెరిగేవని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ, ఉత్తరాదికి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ లేనిపోని సాకులు చెప్పి, మెజారిటీ సభ్యుల మద్దతు రాకుండా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయి. ఆడబిడ్డలంటే విపక్షాలకు ఇంత చులకనా?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాట్లాడానని, ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. 2017లోనే టీడీపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం బిల్లు కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు. 2029 నుంచి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే సదుద్దేశంతో సవరణ బిల్లు తీసుకువస్తే, దానిని నీరుగార్చడం శోచనీయమన్నారు.

"నిన్న జరిగిన ఈ విద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళతాం. ఇవాళ చేపట్టిన నిరసన కేవలం ఆరంభం మాత్రమే. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో సమర్థవంతంగా రాణిస్తున్నారు. అలాంటి వారు చట్టసభల్లోకి వస్తే సమాజానికి న్యాయం జరుగుతుంది. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేని ఈర్ష్యతోనే బిల్లును అడ్డుకున్నారు. ఈ ద్రోహానికి పాల్పడిన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెప్పాలి. ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Go Back to Shorts
Chandrababu
Women Reservation Bill
Protest
Nidadavolu
TDP
BJP
Janasena
Congress
NDA
INDIA Bloc
Andhra Pradesh.

More Telugu News