రోడ్డు ప్రమాదంలో నాసిక్ వివాదాస్పద గురువు అశోక్ కారత్ సన్నిహితుడి మృతి

  • ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం
  • ప్రమాద తీవ్రతకు తుక్కుతుక్కుగా మారిన కారు
  • అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రేప్, మోసం వంటి తీవ్రమైన ఆరోపణలతో జైల్లో ఉన్న నాసిక్‌కు చెందిన వివాదాస్పద గురువు అశోక్ కారత్ కు అత్యంత సన్నిహితుడైన జితేంద్ర షెల్కే (55), అతడి భార్య అనురాధ షెల్కే (50) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జితేంద్ర షెల్కే తన కుటుంబంతో కలిసి చత్రపతి సంభాజీనగర్ నుంచి థానేకు కారులో బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అహిల్యానగర్ జిల్లా పరిధిలోని ధోత్రే గ్రామం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురినీ సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జితేంద్ర, అనురాధ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

జైలులో ఉన్న అశోక్ కారత్ స్థాపించిన శివనికా ట్రస్ట్‌కు జితేంద్ర షెల్కే వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కారత్ కు వ్యాపార భాగస్వామిగా, అత్యంత సన్నిహిత వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై కోపర్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంటల్ డెత్ కేసు నమోదు చేశారు. అహిల్యానగర్ జిల్లా ఎస్పీ సోమనాథ్ ఘర్గే మాట్లాడుతూ, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను కనుగొనడానికి ఆర్‌టీఓ, ఆటోమొబైల్ నిపుణులతో క్రాష్ అనాలిసిస్ నిర్వహిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రమాదమా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Ashok Karat
Ashok Karat wife
Nashik guru
Road accident
Samruddhi Mahamarg
Mumbai Nagpur Expressway
Maharashtra accident
Car accident India
Indian spiritual leader

More Telugu News