మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదు, మహిళలకు 272 సీట్లు లభిస్తాయి: కేంద్రమంత్రి

  • మహిళా రిజర్వేషన్‌తో ఏ రాష్ట్రానికి, ఏ పురుషుడికి అన్యాయం జరగదన్న కేంద్రమంత్రి
  • పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్న అర్జున్ రామ్ మేఘ్ వాల్
  • లోక్ సభ స్థానాలు 50 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామన్న కేంద్రమంత్రి
మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం జరగదని, ఈ బిల్లు ద్వారా లోక్ సభలో మహిళలకు 272 సీట్లు లభిస్తాయని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు వీలుగా కేంద్రం మూడు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. అనంతరం వీటిపై చర్చ ప్రారంభించారు.

అర్జున్ రామ్ మేఘ్ వాల్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల అమలుతో ఏ రాష్ట్రానికి లేదా ఏ పురుషుడికి నష్టం జరగబోదని స్పష్టం చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్నారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని బిల్లులను భవిష్యత్తు తరాలు మరవలేవని, అందులో ఈ బిల్లు ఉంటుందని అన్నారు.

ఆర్టికల్ 368 ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పార్లమెంటుకు రాజ్యాంగం శక్తిని ఇచ్చిందని అన్నారు. అందులో భాగంగానే మూడు బిల్లులను ప్రవేశపెట్టామని తెలిపారు. లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని అన్నారు. లోక్ సభ స్థానాలు 815కు పెరుగుతాయని, అప్పుడు మహిళలకు 272 స్థానాలు వస్తాయని అన్నారు. మహిళల కోటాలోనే ఎస్సీ, ఎస్టీలకు ఉపకోటా లభిస్తుందని తెలిపారు.

Arjun Ram Meghwal
Women Reservation Bill
Lok Sabha
Parliament
Indian Politics
Women in Politics

More Telugu News