తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారు: కవిత

Kavitha Warns Against Suppressing Telangana Voice on Delimitation
  • డీలిమిటేషన్ లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలన్న కవిత
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదని వ్యాఖ్య

తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులపై ఆమె తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


ప్రస్తుతం పార్లమెంట్‌లో తెలంగాణకు ఉన్న 3.13 శాతం ప్రాతినిధ్యాన్ని బేస్‌లైన్‌గా పరిగణించాలని, పునర్విభజన తర్వాత కూడా ఈ శాతం తగ్గకుండా చూడాలని కవిత డిమాండ్ చేశారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే అది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.


మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై కవిత అసహనం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును ఓబీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టాలని, 33 శాతం కోటాలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా కల్పిస్తేనే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తే వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు.

Go Back to Shorts
Kavitha
Kalvakuntla Kavitha
Telangana
Parliament
Delimitation
Women Reservation Bill
BRS
Telangana Jagruthi
Constituency
Reservations

More Telugu News