హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక

  • తెలంగాణలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • రానున్న మూడు రోజుల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం
  • వడగాలులు వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆయా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. వడగాలులు వీచే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Telangana Weather
Hyderabad Weather
Orange Alert
Heatwave
IMD
Weather Forecast
Telangana districts

More Telugu News