తండ్రి పాపంలో కొడుకుగా జగన్ కు కూడా భాగస్వామ్యం ఉంది: సోమిరెడ్డి

తీరప్రాంత ప్రజలను, మత్స్యకారులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం దశాబ్దాలుగా మోసం చేస్తూనే ఉందని, ఆ పాపంలో కొడుకుగా జగన్ కూడా భాగస్వామి అయ్యారని మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం ఆర్థిక లబ్ధి కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కృష్ణపట్నం పోర్టు నుంచి వాడరేవు వరకు ఎలాంటి పోర్టులు, హార్బర్లు నిర్మించకూడదని జీవో నెంబర్ 40 జారీ చేసి తీరప్రాంతానికి తీరని ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. మత్స్యకారుల ప్రయోజనాలకు గండికొట్టిన ఈ జీవోను 2018లో చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు.

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ, "తెలుగుదేశం పార్టీ 2018-19లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్రంతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సహకారంతో జువ్వలదిన్నె హార్బర్‌కు అనుమతులు సాధించాం. 2019 మార్చి 7న టీడీపీ ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కోసం రూ. 288 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, కేవలం టెండర్లు పిలవడం, డబ్బులు దండుకోవడంపైనే దృష్టి పెట్టింది తప్ప, ఐదేళ్ల పాలనలో హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది" అని సోమిరెడ్డి విమర్శించారు.

ఈ సందర్భంగా మత్స్యకారులకు ఆయన పలు హామీలు ఇచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలో జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణాన్ని పూర్తిచేసి మత్స్యకారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నెల్లూరు జెట్టీని పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన ఉద్ఘాటించారు. మత్స్యకారులకు అన్యాయం జరిగితే, తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి గొంతెత్తే మొదటి వ్యక్తిని తానే అవుతానని ఆయన అన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మత్స్యకారుల సమస్యలన్నింటినీ తీసుకెళ్లానని సోమిరెడ్డి తెలిపారు. తన విజ్ఞప్తిపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించి, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి సీఎంఓ అధికారి రాజమౌళిని ఆదేశించారని వెల్లడించారు. కారైకాల్, కడలూరు నుంచి వచ్చే పడవలతో అక్రమ చేపల వేటను నిరోధించేందుకు 650 హెచ్‌పీ సామర్థ్యం గల 4 స్టీల్ బోట్లను ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయించామని గుర్తుచేశారు. 

సర్వేపల్లి నియోజకవర్గంలో మత్స్యకారులకు రెండు బోట్లపై సబ్సిడీని 40 శాతం నుంచి 60 శాతానికి పెంచేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారులు తమ కుటుంబంలో భాగమని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడైనా తమ దృష్టికి తీసుకురావచ్చని సోమిరెడ్డి భరోసా ఇచ్చారు.



Somireddy Chandramohan Reddy
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
fishing harbor
Juvaladinner harbor
fishermen welfare
Nellore jetty
TDP
Chandrababu Naidu
fisheries

More Telugu News