ఆశా భోంస్లే కన్నుమూత... చేతికి నల్ల రిబ్బన్లతో బరిలో దిగిన ఐపీఎల్ జట్లు

గానకోకిల, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బహుళ అవయవ వైఫల్యం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతికి నివాళిగా, వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రీడాకారులు మైదానంలో ఒక నిమిషం మౌనం పాటించి ఆశా భోంస్లే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె గౌరవార్థం నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగుతున్నట్లు ముంబై ఇండియన్స్ జట్టు తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. భారతీయ సంగీతానికి, సినీ పరిశ్రమకు ఇది తీరని లోటని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంటరీలో పేర్కొన్నారు.

ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో ఆశా భోంస్లే వివిధ భారతీయ భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. ఆమె మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆశా భోంస్లే అంత్యక్రియలు సోమవారం ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Asha Bhosle
Asha Bhosle death
IPL tribute
Mumbai Indians
Royal Challengers Bangalore
Wankhede Stadium
Sunil Gavaskar
Indian music
Padma Vibhushan
Dadasaheb Phalke Award

More Telugu News