పులివెందులకు 'అవి గొడ్డలి' అని పేరు పెట్టండి: షర్మిల సెటైర్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ రాజధానికి 'మావిగన్' అని పేరు పెట్టాలన్న జగన్ ప్రతిపాదనను ఆమె తీవ్రంగా ఎగతాళి చేశారు దీనికి కౌంటర్‌గా, పులివెందుల నియోజకవర్గానికి 'అవి గొడ్డలి' అని పేరు మార్చాలంటూ సంచలన సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి.

జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' ఆలోచనను పూర్తిగా అపహాస్యం చేసిన షర్మిల, వైసీపీ సిద్ధాంతంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఎంతసేపు గన్నులు, గొడ్డళ్లేనా? నరకాలి, చంపాలి, నాశనం చేయాలనే ఆలోచిస్తారా?" అని ఆమె ప్రశ్నించారు. జగన్ పేరులో 'గన్' ఉందని, వైఎస్ అవినాశ్ రెడ్డి పేరులో 'వినాశనం' ఉందని, వారి ఆలోచనా విధానం కూడా హింస చుట్టూనే తిరుగుతుందని ఆమె ఆరోపించారు. వివేకా హత్య కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ, "అమరావతికి మీ పేరు మీద ‘మావిగన్’ అని పెడితే, పులివెందులకు అవినాష్ రెడ్డి పేరు మీద ‘అవి గొడ్డలి’ అని పెట్టాలి" అని ఎద్దేవా చేశారు.

గత ఐదేళ్ల పాలనలో జగన్ రాజధాని అమరావతి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదని షర్మిల విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేయడంతోనే పాలన మొదలుపెట్టారని గుర్తుచేశారు. "ఇప్పుడు అమరావతి వద్దు, మావిగన్ పెడతారట. ఈ ఐడియా అంత అద్భుతంగా ఉంటే, ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదు?" అని ఆమె నిలదీశారు. 'మావిగన్‌'కు ఖర్చు తక్కువైతే, మరి మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు.

జగన్ 'మావిగన్' ప్రతిపాదనపై తమ వైఖరి ఏంటని అడుగుతున్నారని, ఎవరైనా ఓ జోక్ వింటే గట్టిగా నవ్వాలి తప్ప స్పందించాల్సిన అవసరం లేదని ఆమె కొట్టిపారేశారు. ఇదే సందర్భంలో, గతంలో నిండు సభలో వైఎస్ విజయమ్మను అవమానించినందుకు మంత్రి బొత్స సత్యనారాయణ ఎంత ఏడ్చినా తక్కువేనని కూడా షర్మిల వ్యాఖ్యానించారు. 

YS Sharmila
AP Congress
Jagan Mohan Reddy
Mavigan
Pulivendula
Avinash Reddy
Viveka murder case
Amaravati
Andhra Pradesh politics
YS Vijayamma

More Telugu News