మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స... వీడియో ఇదిగో!

Botsa Satyanarayana Breaks Down Over Allegations Against YS Jagan
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుట వెక్కివెక్కి ఏడ్చారు. టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొత్స తీవ్ర ఆవేదనతో విలపించారు.

టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ చేసిన ఆరోపణలపై స్పందించేందుకే బొత్స ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందని, ఈ విషయం బొత్సనే చెప్పారని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా దిగజారుడు రాజకీయమని, కూటమి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని బొత్స స్పష్టం చేశారు. “వైఎస్ మరణించినప్పుడు జగన్ ఏపీలో లేరని అచ్చెన్న చెప్పడం అవాస్తవం. ఆ రోజు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్‌ను నా భార్య ఝాన్సీ, నేను చెరోపక్క పట్టుకుని తీసుకొచ్చాం” అని వివరిస్తూ బొత్స భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మాటలు తడబడటంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది.

రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలై 23 ఏళ్లు పూర్తయిన ఈ రోజున ఆయన గురించి ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం దారుణమని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్సార్ వల్లే కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆయనతో తమకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని అన్నారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసి, తన ఉనికిని కాపాడుకోవడం కోసం అచ్చెన్నాయుడు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారం ఉందని, రెండు పత్రికలు, మూడు ఛానళ్లు చేతిలో ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

వైఎస్ హెలికాప్టర్ గల్లంతైన రోజు నుంచి ఆయన మృతదేహాన్ని కనుగొనే వరకు జరిగిన పరిణామాలను బొత్స వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ, కర్నూలులో పోస్టుమార్టం జరిపించి, మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని కూటమి నేతలకు సూచించారు. తన గుండెల్లో ఎన్నో విషయాలు ఉన్నాయని, కానీ దిగజారుడు రాజకీయాలు చేయనని ఆయన స్పష్టం చేశారు. బొత్స కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Go Back to Shorts
Botsa Satyanarayana
YS Rajasekhara Reddy
YSR
Achannaidu
YSR death
Andhra Pradesh politics
YSRCP
TDP
Visakhapatnam
Political allegations

More Telugu News