ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి భారీ ఊరట

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన బెయిల్ షరతులను విజయవాడ ఏసీబీ కోర్టు సడలిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో హాజరై సంతకం చేయాలన్న నిబంధనను న్యాయస్థానం రద్దు చేసింది.

మద్యం కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న మిథున్ రెడ్డికి గతంలో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును సిట్ అధికారులకు అప్పగించాలని, ప్రతివారం సిట్ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశించింది. అయితే ఈ షరతులను సడలించాలని కోరుతూ మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం వాదనలు ముగియడంతో ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పును వెలువరించారు.

ప్రతివారం సంతకం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి, పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు వెసులుబాటు కల్పించారు. రూ.లక్ష డిపాజిట్ చేసి, సిట్ అధికారుల వద్ద ఉన్న తన పాస్‌పోర్టును తిరిగి తీసుకోవచ్చని తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తాజా ఆదేశాలతో మిథున్ రెడ్డికి బెయిల్ నిబంధనల విషయంలో ఉపశమనం లభించినట్లయింది.

Mithun Reddy
AP Liquor Scam
YSRCP MP
Andhra Pradesh
ACB Court
Bail Conditions Relaxed
Liquor Case
Vijayawada
SIT Investigation
Passport

More Telugu News