'మావిగన్' నచ్చకపోతే 'అయోధ్య' అని పేరు పెట్టుకోండి: పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం, ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లా ముస్తాబాద్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, అటు రాజధాని అంశంపై, ఇటు మీడియా సంస్థల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' ప్లాన్ తప్పు అయితే నిరూపించాలని పేర్ని నాని సవాల్ విసిరారు. వందేళ్లయినా పూర్తికాని అమరావతి పేరుతో కేవలం దోపిడీ చేస్తున్నారని, రాష్ట్రం అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే జగన్ ఈ కొత్త ప్రతిపాదన తెచ్చారని సమర్థించారు. "ఒకవేళ మావిగన్ నచ్చకపోతే ఆ ప్రాంతానికి అయోధ్య అని పేరు పెట్టుకోండి, కానీ దోపిడీ మాత్రం ఆపండి" అని అన్నారు.
ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు రాధాకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. కాశీకి వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో దాదాపు 4 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని అడిగారు.
కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలో రాధాకృష్ణ 'బ్యాచ్' ఎంత పెట్టుబడి పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు.