అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్ కథ సుఖాంతం.. విడుదల చేసిన ఇరాన్ అనుకూల మిలీషియా

ఇరాక్‌లో గత వారం కిడ్నాప్‌కు గురైన అమెరికా జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ సురక్షితంగా విడుదలయ్యారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఆమె విడుదలతో తామంతా ఊపిరి పీల్చుకున్నామని, ఇరాక్ నుంచి ఆమె సురక్షితంగా బయటకు వచ్చేందుకు పూర్తి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు.

మార్చి 31న బాగ్దాద్‌లోని ఒక వీధిలో ఇరాన్ మద్దతున్న కతైబ్ హిజ్బుల్లా అనే మిలీషియా గ్రూప్ షెల్లీ కిటిల్సన్‌ను అపహరించింది. తాజాగా ఆమెను విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే, విడుదలైన వెంటనే ఆమె దేశం విడిచి వెళ్లిపోవాలనే షరతు విధించింది. ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్-సుదానీ దేశభక్తి వైఖరిని ప్రశంసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి చొరవ మళ్లీ ఉండదని కతైబ్ హిజ్బుల్లా స్పష్టం చేసింది.

అయితే, ఈ విడుదలకు బదులుగా, గతంలో ఇరాక్ అధికారులు అదుపులోకి తీసుకున్న తమ గ్రూపు సభ్యులను విడుదల చేయనున్నారని మిలీషియా వర్గాలు అనధికారికంగా తెలిపాయి. ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగానే కిటిల్సన్‌ను వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.

49 ఏళ్ల కిటిల్సన్ చాలా సంవత్సరాలుగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా మధ్యప్రాచ్యంలో పనిచేస్తున్నారు. కిడ్నాప్‌కు కొన్ని రోజుల ముందే ఆమె ఇరాక్‌లోకి ప్రవేశించారు. ఆమెకు ముప్పు పొంచి ఉందని అమెరికా అధికారులు పలుమార్లు హెచ్చరించినా, ఆమె అక్కడే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. కిటిల్సన్ విడుదలకు కృషి చేసిన ఇరాక్ అధికారులు, ఎఫ్‌బీఐ, అమెరికా రక్షణ శాఖకు మంత్రి మార్కో రూబియో కృతజ్ఞతలు తెలిపారు.

Shelly Kittilson
American journalist
Iraq kidnapping
Kataib Hezbollah
Marco Rubio
Baghdad
Iran militia
journalist release
prisoner exchange
Middle East

More Telugu News