గౌహతిలో భారీ వర్షం... రాజస్థాన్ రాయల్స్, ముంబై మ్యాచ్ ఆలస్యం

గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగరంలో సుమారు మూడు గంటల పాటు భారీ వర్షం కురవడంతో, బర్సపరాలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని సిబ్బంది కవర్లతో పూర్తిగా కప్పి ఉంచారు.

షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సూపర్‌ సాపర్ల సహాయంతో ఔట్‌ఫీల్డ్‌లోని నీటిని తొలగిస్తున్నారు. త్వరలోనే అంపైర్లు మైదానాన్ని పరిశీలించి టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. రాత్రి 8:30 గంటల లోపు ఆట మొదలైతే ఓవర్ల కోత ఉండదని నిర్వాహకులు తెలిపారు.

ఈ సీజన్‌లో గౌహతిలో రాజస్థాన్‌కు ఇది రెండో ‘హోమ్’ మ్యాచ్. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి మంచి ఊపు మీదుంది. మరోవైపు, ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది.

ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రాజస్థాన్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మధ్య పోరుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ లో ఇప్పటికే ఒక సెంచరీ, 30 సిక్సర్లు బాదిన ఈ బీహార్ కుర్రాడు.. బుమ్రా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని అందరూ భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి వర్షం ఈ ఆసక్తికరమైన పోరుకు అడ్డుగా నిలిచింది.

Rajasthan Royals
Rajasthan Royals vs Mumbai Indians
IPL 2024
Gauhati Rain
Mumbai Indians
Jasprit Bumrah
Vaibhav Suryavanshi
Assam Cricket Association Stadium

More Telugu News