క్లిష్టమైన సొరంగంలో 18.8 కిలోమీటర్లు ప్రయాణించిన మంత్రి నిమ్మల

వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం సాహసోపేత యాత్ర చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు కొల్లం వాగు నుంచి అత్యంత క్లిష్టమైన వెలిగొండ సొరంగంలో ఆయన ఏకంగా 18.8 కిలోమీటర్ల మేర పడవలో ప్రయాణించి పనులను సమీక్షించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద నిలిచిపోయిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్) యంత్రాన్ని పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో సుమారు రెండు గంటల పాటు ప్రయాణించిన ఆయన, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, గత ప్రభుత్వం పనులు పూర్తికాకుండానే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిందని విమర్శించారు. ప్రస్తుతం హెడ్ రెగ్యులేటర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యం మేరకు 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఫీడర్ కెనాల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్వాసితులకు ఈ ఏప్రిల్ నుంచే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.



Nimmala Ramanayudu
Veligonda Project
Andhra Pradesh Irrigation
Tunnel Project
Srisailam Project
Chandrababu Naidu
Irrigation Project
TBM Machine
Feeder Canal
R and R Package

More Telugu News