అమరావతికి రాజముద్ర... అసలైన పరీక్ష ఇప్పుడేనన్న విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక చర్యగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. అయితే, అసలు పరీక్ష ఇప్పుడేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేయడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. 2024 జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రావడం ఒక చారిత్రాత్మక ముందడుగు. అయితే, ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఎలా అమలు చేస్తుందన్నదే అసలైన సవాల్.

2014 నుంచి ఏడేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ, ఒక ప్రాధాన్య నగరం చూడాల్సినంత అభివృద్ధిని అమరావతిలో చూపించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా, రాజధాని విషయంలో ఇతర ప్రణాళికలతో ముందుకు వెళ్లింది.

ఈ విషయంలో నా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. గతంలో పేదలకు ఇచ్చిన 50,000 పట్టాలను రద్దు చేశారు. వాటిని వెంటనే పునరుద్ధరించాలి. అదే సమయంలో, అమరావతిలో మౌలిక సదుపాయాలను నిర్మించాలి. అమరావతి నిజమైన ప్రజా రాజధానిగా, కులం, మతం, వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుకొనిపోయే రాజధానిగా రూపుదిద్దుకోవాలి. అదే నా ఆకాంక్ష" అంటూ విజయసాయి స్పష్టం చేశారు.

Vijayasai Reddy
Amaravati
Andhra Pradesh Capital
Droupadi Murmu
AP Capital
YSRCP
TDP
AP Politics
Amaravati Development
Real challenge

More Telugu News