అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ఘనత.. కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ!

భారత అణుశక్తి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడులోని కల్పక్కంలో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్ బీఆర్) తొలిసారిగా ‘క్రిటికాలిటీ’ని విజయవంతంగా సాధించింది. దీంతో మన దేశం అణు విద్యుత్ కార్యక్రమంలో అత్యంత కీలకమైన రెండో దశలోకి అధికారికంగా ప్రవేశించింది.

ఒక అణు రియాక్టరులో అణు విచ్ఛిత్తి ప్రక్రియ తనకు తానుగా, స్థిరంగా కొనసాగే అత్యంత కచ్చితమైన స్థితిని ‘క్రిటికాలిటీ’ అంటారు. అంటే, రియాక్టరులో జరిగే ప్రతి అణు విచ్ఛిత్తి ఘటన, తదుపరి విచ్ఛిత్తిని ప్రేరేపించడానికి అవసరమైన నైట్రాన్లను స్థిరమైన వేగంతో ఉత్పత్తి చేస్తుందని అర్థం. అంటే, 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రియాక్టర్ ఇక విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉందని అర్థం. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత అణు ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక అడుగని, మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైపుణ్యానికి నిదర్శనమని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు.

ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇంధనాన్ని వినియోగించుకోవడమే కాకుండా, వాడిన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని (ప్లుటోనియం) ఉత్పత్తి చేస్తుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రభుత్వ రంగ సంస్థ ‘భవిని’ దీనిని నిర్మించింది. వాణిజ్య స్థాయిలో రష్యా తర్వాత ఇలాంటి రియాక్టర్‌ను నిర్వహిస్తున్న ఘనత సాధించిన రెండో దేశంగా భారత్ నిలిచింది.

భారత్ వద్ద యురేనియం నిల్వలు తక్కువగా, థోరియం నిల్వలు అపారంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ థోరియం నిల్వలను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే మూడో దశకు ఈ రియాక్టర్ ఒక వారధిగా పనిచేస్తుంది. 2026 సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2070 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ముందడుగు కీలక పాత్ర పోషించనుంది.

Kalpakkam Reactor
Prototype Fast Breeder Reactor
PFBR
Nuclear energy India
Bhavini
Kalpakkam
Narendra Modi
Nuclear power
Thorium
Plutonium

More Telugu News