Mungara Mamata: బాల భీముడు.. 4.5 కిలోల బరువుతో మగ బిడ్డ జననం
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుప్రతిలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముంగర మమత అనే గిరిజన మహిళ ఏకంగా నాలుగున్నర కిలోల బరువున్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. గైనకాలజిస్ట్ మౌనిక పర్యవేక్షణలో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు.
సాధారణంగా, ప్రసవం సమయంలో శిశువులు 2 నుంచి 3.5 కిలోల మధ్య బరువు ఉంటారని, అయితే ఈ బాబు 4.5 కిలోల బరువు ఉండటం విశేషమని డాక్టర్లు తెలిపారు. ఇంతటి భారీ బరువు ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధారణ ప్రసవం జరగడం గమనార్హం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. బిడ్డ 4.5 కిలోల బరువుతో పుట్టడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.