Narendra Modi: ఆ సినిమాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్ష పార్టీలు 'ధురందర్', 'ది కేరళ స్టోరీ', 'ది కశ్మీర్ ఫైల్స్' వంటి సినిమాలతో పాటు పలు అంశాలపై ఉద్దేశపూర్వకంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. "కాంగ్రెస్, యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ పార్టీలు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెబుతాయి. అది వారి నైజంగా మారింది. దేశాన్ని తప్పుదోవ పట్టించడమే వారి స్వభావం" అని అన్నారు. సినిమాల విషయంలోనూ ప్రతిపక్షాలు ఇదే తీరును ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. 

"అబద్ధాలు చెప్పడంలో వారు నిపుణులు. 'ది కేరళ స్టోరీ' వచ్చినప్పుడు అదంతా అబద్ధం అన్నారు. 'ది కశ్మీర్ ఫైల్స్' వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు 'ధురందర్' సినిమా విషయంలోనూ అబద్ధమని ప్రచారం చేస్తున్నారు" అని ప్రధాని పేర్కొన్నారు.

గతంలో సీఏఏ చట్టం తెచ్చినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు ఆ చట్టం అమల్లోకి వచ్చినా దేశానికి ఎలాంటి నష్టం జరగలేదని మోదీ గుర్తుచేశారు. "యూసీసీ, ఎఫ్‌సీఆర్‌ఏ వంటి అంశాల్లోనూ వారు అవే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. గోవాలో దశాబ్దాలుగా యూసీసీ అమల్లో ఉంది. అబద్ధాలు వ్యాప్తి చేయడమే వారి వ్యాపారం" అని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్', వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది కశ్మీర్ ఫైల్స్', సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన 'ది కేరళ స్టోరీ' చిత్రాలు వాటి కథావస్తువుల కారణంగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జాతీయ భద్రత, కశ్మీరీ పండిట్ల వలస, కేరళ యువతుల ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ వంటి అంశాలపై ఈ సినిమాలు తెరకెక్కాయి.
Narendra Modi
Congress party
The Kerala Story
The Kashmir Files
Dhurandar movie
BJP
Kerala elections
Political propaganda
CAA
UCC

More Telugu News