Vijayasai Reddy: అమరావతిపై సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసిన విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగింపుపై రాజకీయంగా స్పష్టత వచ్చినప్పటికీ, చట్టపరంగా భవిష్యత్తులో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టపరమైన అంశాలను పరిశీలించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

"అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించడం అనేది రాజకీయంగా ఒక కొలిక్కి వచ్చిన అంశం కావచ్చు. అయితే, భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలకమైన చట్టపరమైన అంశాలను పరిశీలించాలని నేను సలహా ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ధారించడం వెనుక కొన్ని తీవ్రమైన న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని నేను భావిస్తున్నాను.

మొదటగా, రాజధానిని నిర్ణయించడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని 2020లో కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు అదే కేంద్రం చట్టం ద్వారా రాజధానిని నిర్ణయిస్తే, అది తన వైఖరిని తానే వ్యతిరేకించుకున్నట్టు అవుతుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు మాత్రమే అధికారం ఇస్తాయి తప్ప, ఒక శాశ్వత రాజధానిని నిర్దేశించడానికి కాదు. రాజధాని ఎంపిక అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక విధి.

కేంద్రం ఒక చట్టం ద్వారా రాజధానిని రాష్ట్రంపై రుద్దడం మన సమాఖ్య వ్యవస్థ ప్రాథమిక స్వరూపాన్నే దెబ్బతీస్తుంది. ఇది రాష్ట్రాన్ని కేంద్రం నిర్దేశించే ఒక యూనిట్‌గా మార్చుతుంది. ఇంతకుముందు దేశంలో ఏ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ రాజధానిని నిర్దేశించిన దాఖలాలు లేవు. ఆ నిర్ణయాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకే వదిలేశారు. అలాంటప్పుడు, ఏకపక్షంగా అమరావతిని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు సరైన ప్రాతిపదిక లేదు.

ఒకవేళ ఈ చట్టపరమైన అంశాలపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, కోర్టు దీనిని కొట్టివేసే ప్రమాదం ఉంది. అలా జరిగితే రాష్ట్ర పాలనలో తీవ్రమైన అనిశ్చితి ఏర్పడుతుంది. అందుకే, ఒక రాజధాని అనేది చట్టం ద్వారా రుద్దబడటం కాకుండా, ఆర్థిక వెసులుబాటు, పరిపాలనా సౌలభ్యం, ప్రజా పెట్టుబడుల ఆధారంగా సహజంగా అభివృద్ధి చెందాలి. ఈ న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లడం రాష్ట్రానికి శ్రేయస్కరమని నా అభిప్రాయం" అని విజయసాయి వివరించారు. 
Vijayasai Reddy
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
AP Reorganisation Act 2014
AP High Court
Capital City
Legal Issues
Political News
State Government

More Telugu News