Green Sanvi: హర్మూజ్ దాటిన ఎల్పీజీ నౌక 'గ్రీన్ శాన్వి'... గుజరాత్ మంత్రి ట్వీట్‌పై స్పందించిన ఇరాన్

భారతదేశ జెండా కలిగిన గ్యాస్ కంటైనర్ 'గ్రీన్ శాన్వి', సుమారు 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌తో హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఇంతకుముందు, మార్చి 28న 47,000 మెట్రిక్ టన్నుల పెట్రోలియం గ్యాస్‌తో కూడిన నౌక గుజరాత్, జామ్‌నగర్‌లోని కాండ్లాలో గల వాడినార్ టెర్మినల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఎల్పీజీతో కూడిన గ్రీన్ శాన్వి మరికొద్ది రోజుల్లో భారత్‌కు చేరుకోనుంది.

ఈ మేరకు గుజరాత్ మంత్రి హర్ష్ సింఘ్వీ 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు. "ఎల్పీజీ నౌక గ్రీన్ శాన్వి విజయవంతంగా హర్మూజ్ జలసంధిని దాటింది. భారత దౌత్యానికి ఇది మరో విజయం" అని పేర్కొన్నారు.

మంత్రి ట్వీట్‌పై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ స్పందించింది. భారత్‌తో స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. శతాబ్దాల క్రితం మా ప్రాంతం నుంచి వచ్చిన వారికి భారత్, ముఖ్యంగా గుజరాత్ సాదరంగా స్వాగతం పలికాయని, కాబట్టి మా చరిత్రలో వీటికి విశిష్ఠ స్థానం ఉందని పేర్కొంది. ఈ సుదీర్ఘ నాగరికత అనుబంధాన్ని పునాదిగా చేసుకుని, స్నేహం, సహకార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

భారత్ జెండాతో కూడిన ఎనిమిది నౌకలు ఇప్పటి వరకు హర్మూజ్ జలసంధిని దాటాయి. మరో 15 నౌకలు అక్కడే ఉండిపోయాయి. ఆ నౌకలను సురక్షితంగా భారత్ తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
Green Sanvi
LPG vessel
Hormuz Strait
Iran
Gujarat
Harsh Sanghavi
India Iran relations
Vadinar Terminal

More Telugu News