Sensodyne: ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు!

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెండు వేర్వేరు ముఠాల గుట్టును దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. ఒక ముఠా ప్రముఖ బ్రాండ్ పేరుతో నకిలీ టూత్‌పేస్ట్‌ను తయారు చేస్తుండగా, మరో ముఠా గడువు ముగిసిన ఆహార పదార్థాలను రీప్యాక్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఈ రెండు ఘటనలకు సంబంధించి మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. అనారోగ్యకరమైన వాతావరణంలో ఈ దందాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, ఖచ్చితమైన సమాచారంతో క్రైమ్ బ్రాంచ్ బృందం గురువారం ఖంజావాలాలోని ఓ గోడౌన్‌పై దాడి చేసింది. అక్కడ ప్రముఖ బ్రాండ్ 'సెన్సోడైన్' పేరుతో నకిలీ టూత్‌పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో హరి ఓం మిశ్రా (58) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సుమారు 1,800 నకిలీ టూత్‌పేస్ట్ ట్యూబులు, 10,000కు పైగా ఖాళీ ట్యూబులు, ప్యాకింగ్ సామాగ్రి, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మరో ఆపరేషన్‌లో భాగంగా ద్వారకా ప్రాంతంలో ఓ ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు. గడువు తేదీ ముగిసిన లేదా దగ్గర పడుతున్న ప్రముఖ బ్రాండ్ల శీతల పానీయాలు, బిస్కెట్లను వీరు రీప్యాక్ చేస్తున్నారు. పాత తేదీలను థిన్నర్లతో చెరిపివేసి, కొత్త తయారీ, గడువు తేదీలను ముద్రించి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ ఘటనలో కమల్ ముద్గిల్ (56), శివం సింగ్ (27), లోకేశ్ కుమార్ (35) అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. దాదాపు 3,000కు పైగా కూల్ డ్రింక్ క్యాన్లు, పెద్ద మొత్తంలో బిస్కెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించి, నమూనాలను సేకరించారు. రెండు ఘటనలపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Sensodyne
Sensodyne toothpaste
fake toothpaste
Delhi crime branch
expired food
repackaging scam
food safety
Khajawala
Dwarka
Hari Om Mishra

More Telugu News