Manchu Lakshmi: మగవాళ్లకు ఒక రూల్.. ఆడవాళ్లకు ఒక రూలా?": సమాజంపై మంచు లక్ష్మి ఫైర్
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తనయగా కాకుండా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మంచు లక్ష్మి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆదిపర్వం’, ‘దక్ష’ చిత్రాలతో అలరించిన ఆమె, మార్చి చివరి వారంలో ‘లేచింది మహిళా లోకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, మన సమాజం మహిళలను చూసే దృక్పథంపై నిప్పులు చెరిగారు.
సమాజం మహిళలను జడ్జ్ చేసే విధానాన్ని లక్ష్మి తప్పుబట్టారు. "మగవాళ్లు ఏదైనా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే అది గొప్ప అని ప్రశంసిస్తారు. అదే ఆడవాళ్లు చేస్తే మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటారు. 'మేము చేస్తే సంసారం.. మీరు చేస్తే ఆ వ్యవహారం' అనే విధంగా ఉంటుంది. ఆ సామెతను నా నోటితో పూర్తిగా చెప్పను కానీ, మీకు అర్థమైందని అనుకుంటున్నాను" అని ఆమె చమత్కరిస్తూనే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్లు ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి అని రూల్స్ రాసింది ఎవరని ఆమె ప్రశ్నించారు.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని లక్ష్మి పంచుకున్నారు. "నా పెళ్లి సమయంలోనే నా భర్తకు ఒక మాట చెప్పాను. నువ్వు ఏ పని చేస్తావో.. అదే పని నేను కూడా చేయగలను అని గుర్తుంచుకోమన్నాను" అని తెలిపారు. తన మాటల ప్రభావమో ఏమో కానీ, తన భర్త ఏదైనా చేయడానికి జంకుతారని, తను చేస్తే లక్ష్మి కూడా చేస్తుందనే భయం ఆయన మనసులో ఉంటుందని ఆమె సరదాగా పేర్కొన్నారు.