R Krishnaiah: అమరావతిపై రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేయవద్దు: బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అభివృద్ధి అవశ్యమని, దీనిని రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేయవద్దని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం మధ్యలో అమరావతి ఉంటుందని, పాలనాపరంగా సౌలభ్యంగా ఉంటుందని అన్నారు.

రాజధాని అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిని అందరూ సమర్థించాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం చూశామని, అలాగే అమరావతిని అభివృద్ధి చేయాలనే తపన ప్రధాని మోదీకి కూడా ఉందని అన్నారు.

బలహీనవర్గాల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న నమ్మకం ఉందని ఆర్ కృష్ణయ్య అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా చేయడంలో చంద్రబాబు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రాజధాని అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆర్ కృష్ణయ్య అన్నారు.
R Krishnaiah
Amaravati
Andhra Pradesh
AP Capital
BJP
Chandrababu Naidu
Central Government Funds

More Telugu News