Mamata Banerjee: ఆ అధికారుల నిర్బంధం తెలియదు.. పాలన నా చేతుల్లో లేదు: మమతా బెనర్జీ

మాల్దా జిల్లాలో 'సర్' విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన విషయం తనకు తెలియదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ నెలలో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులను నిర్బంధించడం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. సాగర్‌దిఘిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, అధికారుల నిర్బంధం తనకు తెలియదని, ప్రస్తుతం పాలన తన చేతుల్లో లేదని స్పష్టం చేశారు.

అధికారుల నిర్బంధానికి బాధ్యులు ఎవరో తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయమై తనకు ఎవరూ సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. పరిపాలన తన చేతుల్లో లేదని, శాంతిభద్రతలను ఎన్నికల సంఘం నియంత్రిస్తోందని తెలిపారు. వారంతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట వింటున్నారని అన్నారు. అధికారులను కూడా కేంద్రం మార్చిందని ఆరోపించారు. తన అధికారాలన్నీ ఈసీ చేతిలోకి వెళ్లాయని అన్నారు.

ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (ఎస్ఐఆర్)పై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని మమతా బెనర్జీ అన్నారు. మాల్దాలో జరిగిన అధికారుల నిర్బంధం ఘటన బీజేపీ కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికను రద్దు చేయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. న్యాయాధికారులకు రక్షణ కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. తనకు అర్ధరాత్రి సమయంలో ఒక జర్నలిస్టు ద్వారా నిర్బంధం విషయం తెలిసిందని వెల్లడించారు. 
Mamata Banerjee
West Bengal
Election Commission
Malda district
Judicial officers
Assembly elections

More Telugu News