Anthony Albanese: ఇరాన్ యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ, అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఆస్ట్రేలియా నుంచి అనూహ్య వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి కొనసాగిస్తున్న దాడుల ఉద్దేశాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ సూటిగా ప్రశ్నించారు. ఈ యుద్ధానికి ముగింపు ప్రణాళిక ఏంటని ఆయన నిలదీశారు.

నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ప్రసంగించిన అల్బనీస్, ‘‘ఇరాన్‌లో ఇంకా సాధించాల్సింది ఏముంది?’’ అని నేరుగా వేసిన ప్రశ్న అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, దాని సైనిక సామర్థ్యాన్ని తగ్గించడం వంటి అమెరికా ప్రాథమిక లక్ష్యాలకు తాము మద్దతిచ్చామని ఆయన గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత దాడులతో ఆ లక్ష్యాలు ఇప్పటికే నెరవేరాయని, అయినప్పటికీ యుద్ధాన్ని ఎందుకు పొడిగిస్తున్నారో అర్థం కావడం లేదని అభిప్రాయపడ్డారు.

ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంత నష్టమని, ముఖ్యంగా ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని అల్బనీస్ హెచ్చరించారు. ఈ యుద్ధం ప్రారంభించే ముందు తమను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసిన ఆయన, ఆస్ట్రేలియా ఇందులో ప్రత్యక్షంగా పాలుపంచుకోవడం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, భౌగోళికంగా దూరంగా ఉన్నా ఆర్థికంగా తాము భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాకు కీలక మిత్రపక్షంగా ఉన్న దేశం నుంచి ఇలాంటి విమర్శలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Anthony Albanese
Australia
Iran
Israel
Middle East conflict
US relations
War
Economic impact
Nuclear weapons
Energy prices

More Telugu News